తిత్లీ సృష్టించిన ప్రళయానికి విలవిల్లాడుతున్న శ్రీకాకుళం జిల్లా వాసులను ఆదుకునేందుకు టాలీవుడ్ సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. ఈ  క్రమంలో  బాధితులను ఆదుకునేందుకు రూ. 15 లక్షలు ఇస్తున్నానని జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించారు. ఈ మేరకు ఏపీ సీఎం సహాయనిధికి పంపుతున్నట్లు తెలిపారు. ఇదే సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ అన్న, హీరో కల్యాణ్ రామ్ కూడా తనవంతు సాయంగా రూ. 5 లక్షలు ఏపీ సీఎం సహాయనిధికి పంపుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడీయాలో ప్రకటన వెలువడింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై సెలబ్రిటీలు ఈ మేరకు స్పందిస్తుతున్నారు. ఇప్పటికే ఈ విషయంపై స్పందించిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ..సీఎం రిలీఫ్ ఫండ్ కు తన బ్యాంక్ ఖాతా నుంచి  రూ.5 లక్షలు ట్రాన్స్ ఫర్ చేసిన విషయం తెలిసిందే.


తిత్లీ తుఫాను పెను బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. తిత్లీ  సృష్టించిన ప్రళయానికి సిక్కోలు విలవిల్లాడిపోతోంది. కనీస సదుపాయాలు లేక జనాలు రోడ్డున పడ్డారు. మరోవైపు లక్షల ఎకరాలు నీటమునిగాయి. పలు వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కాగా పరిస్థితిని చక్కదిద్దేందుకు ఓ వైపు నుంచి ప్రభుత్వ చర్యలు కొనసాగుతుంటే..మరోవైపు నుంచి స్వచ్ఛంధ సంస్థలు, సెలబ్రిటీలు ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు